దొంగ తనానికి.. వచ్చి ఇంట్లోనే నిద్ర పోయి
August 4, 2026
Prajagalam News
వికారాబాద్ : ఒక దొంగ ... దొంగ తనానికి వచ్చి ఇంట్లోనే నిద్ర పోయిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలో సోమవారం చోటు చేసుకుంది. ఈ విషయమైన ఇంటి యజమాని నవీన్ కుమార్ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. వికారాబాద్ పట్టణంలోని గాంధీ కాలనీలో నివాసం ఉంటున్నామన్నారు. తమ స్వంత గ్రామమైన నవాబుపేట మండలం, చించల్ పేట గ్రామానికి కుటుంబ సభ్యులతో శనివారం వెళ్లామన్నారు. గ్రామం నుంచి సోమవారం ఉదయం వికారాబాద్ లోని ఇంటికి రావడం జరిగిందని, అప్పటికే డోర్ తాళం పగలకొట్టి ఉండటం చూశామన్నారు. కబోర్డు లో పెట్టిన రూ.20 వేలు నగదు, 2 తులాల 8 మాసాల నల్ల పూసల గోల్డ్ దండా కనిపించలేదని అన్నారు. అనంతరం అలాగే బెడ్ రూమ్ లోకి వెళ్లి చూడగా ఒక వ్యక్తి బట్టలు లేకుండా బెడ్ పై పండుకొని ఉన్నారన్నారు. వెంటనే అప్రమత్తమై దయల్ 100 డయల్ కి ఫోన్ చేశామన్నారు. పోలీసులు వచ్చి విచారణ చేయగా గాంధీ కాలనీకి చెందిన సెంట్రల్ మెథడిస్ట్ చర్చి యూత్ ప్రెసిడెంట్ ఎస్.వరుణ్ గా గుర్తించి పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయారని చెప్పారు. కావున తన వస్తువులు దొంగతనం చేసిన ఎస్.వరుణ్ పై చర్యలు తీసుకోవాలని వికారాబాద్ పోలీస్ స్టేషన్ లో పిర్యాదు చేసినట్లు నవీన్ కుమార్ తెలిపారు.ఈ విషయమై వికారాబాద్ ఎస్ఐ ని వివరణ కోరగా దొంగతనం జరిగినట్లు ఫిర్యాదు అందిందని, సిసి కెమెరాలలో క్షుణ్ణంగా పరిశీలిస్తున్నట్లు తెలిపారు.