తాండూరు ప్రభుత్వ ఆసుపత్రి తరలింపుపై దళిత ప్రజా సంఘాల ఆగ్రహం
June 23, 2026
Prajagalam News
(తాండూర్)
తాండూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని మరియు మాతాశిశు ఆసుపత్రిని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ ( డి ఎస్ హెచ్ ) నుండి డైరెక్టరేట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ( డీఎంఈ ) పరిధిలోకి మార్చడంపై సీఐటీయూ, కేవీపీస్, టీఎస్ ఎం.హెచ్ పిఎస్ ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం వ్యక్తం చేస్తూ దశాబ్దాలుగా ప్రజలకు సేవలందిస్తున్న ఈ ఆసుపత్రుల నిర్వహణలో మార్పులు తీసుకురావడం సరికాదని వారు విమర్శించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కేవీపీస్) జిల్లా ప్రధాన కార్యదర్శి ఉప్పలి మల్కయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు యు.బుగ్గప్ప, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ హక్కుల సమితి జిల్లా అధ్యక్షులు కొత్తూరు చంద్రయ్య, టి ఎస్ ఎం హెచ్ పి ఎస్ తాండూరు నియోజకవర్గ ఇన్చార్జ్ ఎండి సాదిక్ లు మాట్లాడుతూ ప్రస్తుతం తాండూరు ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు, నర్సులు మరియు ఇతర వైద్య సిబ్బందిని ఎటువంటి ఇబ్బందికి గురిచేయకుండా, వారిని అక్కడే కొనసాగించాలని డిమాండ్ చేశారు.కోడంగల్ మెడికల్ కాలేజీకి అవసరమైన సిబ్బంది కోసం తాండూరులోని సిబ్బందిని బదిలీ చేయడం కంటే, కోడంగల్ కాలేజీ కోసం ప్రభుత్వం అదనంగా కొత్త సిబ్బందిని నియమించాలని సూచించారు.ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకుని, ఆసుపత్రుల యథాతథ స్థితిని కాపాడాలని కోరారు.ఒకవేళ ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుండా, సిబ్బందిని బదిలీ చేసే ప్రయత్నం చేస్తే, స్థానిక ప్రజలతో మరియు ప్రజా సంఘాల నాయకులతో కలిసి రాష్ట్రవ్యాప్త ఉద్యమాన్ని చేపడతామని హెచ్చరించారు.తాండూరు ప్రజల ఆరోగ్య ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ ఆసుపత్రుల నిర్వహణలో ప్రభుత్వం పారదర్శకంగా వ్యవహరించాలని ఆయన కోరారు. కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు రాజు,బాలప్ప, వెంకటప్ప,రాములు తదితరులు పాల్గొన్నారు.