(తాండూరు)
తాండూరు ఎమ్మెల్యే బుయ్యని మనోహర్రెడ్డి పనితీరు, ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించిన ఆరోపణలు భూవ్యవహారాలు, ఇసుక అక్రమ రవాణా, ఆలయాల స్థలాల్లో దుకాణాల నిర్మాణంపై బీఆర్ఎస్ సీనియర్ నాయకులు తీవ్ర ఆరోపణలు చేశారు. మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి నివాసంలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో మాజీ గ్రంథాలయ చైర్మన్ రాజు గౌడ్, కౌన్సిలర్ ఆసిఫ్, మాజీ ఫ్లోర్ లీడర్ బొబ్బిలి శోభారాణి తదితరులు మాట్లాడుతూ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి కి సంబంధించిన అక్రమాలపై మా దగ్గర అన్ని ఆధారాలు ఉన్నాయని చర్చకు సిద్ధమా అంటూ ప్రశ్నించారు. ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి భూకబ్జాల చిట్టా తమ వద్ద ఉందని అన్నారు.ఫ్యూచర్సిటీ,ఇబ్రహీంపట్నం ప్రభుత్వ భూమి, వికారాబాద్ జిల్లాలోని పలు గ్రామాల్లో సుమారు 250 ఎకరాల వివాదాస్పద భూముల వ్యవహారంపైనా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. డిసిసిబి చైర్మన్ గా ఉన్నప్పుడు సైతం అక్రమలకు పాల్పడ్డారని ఆరోపించారు.తాండూరు ప్రాంతంలో ఇసుక, ఎర్రమట్టి అక్రమ రవాణా కొనసాగుతున్నా ఎమ్మెల్యే ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. చందనవంచ, యాలాల మండలంలోని శివసాగర్ ప్రాజెక్టు ప్రాంతాల నుంచి అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తున్నారంటూ ఆరోపించారు. ఆలయాల ఖాళీ స్థలాల్లో దుకాణాల నిర్మాణానికి నిధులు, టెండర్లు, దుకాణదారుల ఎంపికలో పారదర్శకత లేదని బీఆర్ఎస్ నేతలు విమర్శించారు. ఈ ఆరోపణలపై ఎమ్మెల్యే మనోహర్రెడ్డి ప్రజలకు సమాధానం చెప్పాలని, నిజాయితీని నిరూపించుకోవాలని, లేకపోతే పదవికి రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ విధంగా సమావేశంలో టిఆర్ఎస్ నాయకులు పట్లోళ్ల నర్సింలు, వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, మాజీ కౌన్సిలర్ పరిమళ, నాయకులు ఇర్ఫాన్, బాసిత్ అలీ పాల్గొన్నారు.