schedule Thursday, September 03, 2026

కాంగ్రెస్‌ బాకీ తీర్చేదాకా వదిలిపెట్టం

calendar_today September 3, 2026
person Prajagalam News
కాంగ్రెస్‌ బాకీ తీర్చేదాకా వదిలిపెట్టం
   

• ఎన్నికల హామీలు ఇవ్వకుండా కాంగ్రెస్ పార్టీ పడింది

• 1680 కోట్లకు తాండూర్ ను అభివృద్ధి పథంలో నిలిపాం

• ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం

 • మాజీ ఎమ్మెల్యే  పైలెట్ రోహిత్ రెడ్డి

  (తాండూర్‌)   కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా బాకీ పడిందని తాండూర్‌ మాజీ ఎమ్మెల్యే పైలెట్‌ రోహిత్‌రెడ్డి అన్నారు. ప్రజలకు న్యాయం జరిగే వరకు బీఆర్ఎస్‌ పార్టీ పోరాటం కొనసాగిస్తుందని స్పష్టం చేశారు.బీఆర్ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ పిలుపు మేరకు గురువారం పెద్దేముల్‌, తాండూర్‌ మండలాల్లో నిర్వహించిన రైతు సదస్సులకు పైలెట్‌ రోహిత్‌రెడ్డి హాజరయ్యారు.ఈ సందర్భంగా రోహిత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో తాండూర్‌ నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,680 కోట్లు నిధులు తీసుకొచ్చి వివిధ రంగాల్లో అభివృద్ధి పనులు చేపట్టినట్లు గుర్తు చేశారు.కాంగ్రెస్‌ ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, రైతు భరోసా, రుణమాఫీ, పంట బోనస్‌, పెన్షన్లు, మహిళలకు ఆర్థిక సాయం, రూ.500కే గ్యాస్‌ సిలిండర్‌, విద్యార్థులు–యువతకు ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా ప్రస్తావిస్తూ.. వాటి అమలు పరిస్థితిని ప్రజలకు వివరించారు. మహిళలకు బాకీ.. రైతులకు బాకీ.. యువతకు బాకీ.. విద్యార్థులకు బాకీ.. వృద్ధులు, దివ్యాంగులకు బాకీ.. తెలంగాణ ప్రజలందరికీ కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏదో ఒక రూపంలో బాకీ పడింది అని అన్నారు.కనిపించిన ప్రతి కాంగ్రెస్‌ నాయకుడిని ప్రజలు ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ఎన్నికల సమయంలో మళ్లీ మీ ఊరికి కాంగ్రెస్‌ నాయకులు వస్తే.. ముందుగా మాకు పడిన బాకీ తీర్చండి, ఆ తర్వాతే మా ఊరిలోకి రండి అని చెప్పండి అని సూచించారు.ప్రజల గొంతును అణచివేయాలని చూసినా బీఆర్ఎస్‌ వెనక్కి తగ్గదని పేర్కొన్నారు.హామీలు అమలు చేసే వరకు పోరాటం కొనసాగుతుంది. బీఆర్ఎస్‌, కేసీఆర్‌, కేటీఆర్‌, నేను మీకు న్యాయం జరిగే వరకు అండగా ఉంటాం అని భరోసా ఇచ్చారు.హామీలు నెరవేర్చకపోతే తెలంగాణ ప్రజల ఆగ్రహాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తూ రేవంత్‌రెడ్డికి తెలంగాణ ప్రజల ఉసురు తాకుతుంది అన్నారు.తెలంగాణ ప్రజలకు కాంగ్రెస్‌ ప్రభుత్వం పడ్డ బాకీ తీర్చే వరకు వదిలిపెట్టే ముచ్చటే లేదు అని  స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో రెండు మండల అధ్యక్షులు ముఖ్య నాయకులు, సీనియర్ నాయకులు, పార్టీ కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు..