schedule Saturday, September 05, 2026

కంటి చూపే కీలకం

calendar_today March 29, 2026
person Prajagalam News
కంటి చూపే కీలకం
  జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా
వికారాబాద్ -: వాహనాలు నడిపేవారికి కంటి చూపు ఎంతో కీలకమని జిల్లా ఎస్పీ స్నేహా మెహ్రా అన్నారు. తెలంగాణ రాష్ట్ర డీజీపీ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన "అరైవ్ అలైవ్"కార్యక్రమంలో భాగంగా ఆదివారం వికారాబాద్ జిల్లా మోమిన్ పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఏజేఆర్ గార్డెన్స్‌లో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా ఎస్పీ స్నేహ మెహ్ర శిబిరాన్ని ప్రారంభించి, వాహనదారులకు అవగాహన కల్పించారు.ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ...,రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ట్రాఫిక్ నియమాలను కచ్చితంగా పాటించడం ప్రతి వాహనదారుడి బాధ్యత అని తెలిపారు. ముఖ్యంగా వాహనం నడిపే సమయంలో స్పష్టమైన కంటి చూపు ఉండటం అత్యంత అవసరమని, చిన్నపాటి నిర్లక్ష్యం కూడా ప్రాణాంతక ప్రమాదాలకు దారి తీస్తుందని హెచ్చరించారు. డీజీపీ మార్గదర్శకత్వంలో "అరైవ్ అలైవ్" కార్యక్రమం మూడవ విడతలో భాగంగా జిల్లావ్యాప్తంగా పలు కార్యక్రమాలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఈ ఉచిత వైద్య శిబిరంలో నిపుణులైన వైద్యులు వాహనదారులకు కంటి పరీక్షలు నిర్వహించి, దృష్టి లోపాలు ఉన్నవారిని గుర్తించారన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కంటి అద్దాలు పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ బి. రాములు నాయక్, వికారాబాద్ డి‌ఎస్‌పి శ్రీనివాస్ రెడ్డి, మోమిన్ పేట సర్కిల్ ఇన్స్పెక్టర్ జి. వెంకట్, ధరూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రఘు రాములు,ఎం‌వి‌ఐ శ్రీ లక్ష్మి, మోమిన్ పేట్ సర్పంచ్ సంధ్య, ఎస్‌ఐలు, పోలీస్ సిబ్బంది మరియు వాహనదారులు, స్థానిక ప్రజలు ఇతర అధికారులు పాల్గొన్నారు.